గీతంలో బీబీఏ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) కోర్సు

Telangana

బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒక వినూత్నమైన బీబీఏ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) కోర్సును 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ కోర్సు విద్యార్థులకు అద్భుతమైన విద్యా నైపుణ్యం, ఆచరణాత్మక వ్యాపార నిర్మాణ అనుభవాలను అందించి, వారిని భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, వ్యాపార నాయకులుగా తీర్చిదిద్దేలా రూపొందించామన్నారు.ఈ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, ఆపరేషన్స్, అనలిటిక్స్, మేనేజ్ మెంట్ వంటి ప్రధాన వ్యాపార విభాగాలను, వెంచర్ క్రియేషన్ లో అనుభవపూర్వక అభ్యాసంతో అనుసంధానిస్తుందని తెలిపారు. స్టార్టప్ ల్యాబ్ లు, వ్యవస్థాపకులతో ముఖాముఖి, ఇన్నోవేషన్ స్టూడియోలు, కేస్ స్టడీస్, కస్టమర్ డిస్కవరీ, వెంచర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు ఆచరణాత్మక అనుభవాన్ని పొందుతారని వివరించారు.హైదరాబాదులోని టి-హబ్ లో ఉన్న బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా పరిశ్రమతో ఈ కార్యక్రమానికి బలమైన అనుసంధానం ఉండటం దీనిలోని ఒక ముఖ్యమైన విశేషంగా అభివర్ణించారు.

విద్యార్థులకు మార్గదర్శులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, భారతదేశంలోని అత్యంత చైతన్యవంతమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలలో ఒకదానికి అనుసంధానమవుతారని తెలిపారు. బ్లూమ్ బెర్గ్ సర్టిఫికేషన్, ఇన్నోవేషన్ ల్యాబులు, ప్రోటోటైపు ఫండింగ్ అవకాశాలు, మొదటి ఏడాది నుంచే స్టార్టప్ ఇంటర్న్ షిప్పులు, ఇంకా యాక్సిలరేటర్లు, పిచ్ పోటీలలో పాల్గొనడం వంటివి అభ్యాస అనుభవాన్ని మరింతగా పెంచుతాయన్నారు.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా ఉన్న ఈ పాఠ్య ప్రణాళిక, 162 క్రెడిట్ల ఫ్రేమ్ వర్కుతో ఎనిమిది సెమిస్టర్ల పాటు కొనసాగుతుందని, ఇందులో ప్రత్యేకమైన వెంచన్ ల్యాబులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి విద్యార్థులకు ఆలోచన దశ, వ్యాపార ధ్రువీకరణ, నిధుల సమీకరణ, విస్తరణ, వెంచర్ వృద్ధి వరకు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ డెవలప్ మెంట్ మేనేజర్లు, ఇన్నోవేషన్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, బిజినెస్ డెవలప్ మెంట్ నిపుణులు, వెంచర్ క్యాపిటల్ విశ్లేషకులు, యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మేనేజర్లు, కుటుంబ వ్యాపార నాయకులు, సామాజిక పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ఇన్నోవేటర్లు వంటి విభిన్న కెరీర్ అవకాశాలకు సిద్ధమవుతారని స్పష్టీకరించారు.

ఈ కోర్సు పారిశ్రామికత, నిర్వహణ, ఆవిష్కరణ రంగాలలో ఉన్నత విద్యకు బలమైన పునాదిని కూడా కల్పిస్తుందన్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2లో కనీసం 50 శాతం మార్కులు సాధించి, గీతం ప్రవేశ పరీక్ష (గాట్-2026)లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను (స్కాలర్ షిప్) గీతం అందిస్తుందన్నారు.మరింత సమాచారం కోసం గీతం వెబ్ సైట్ www.gitam.eduను సందర్శించాలని, లేదా సందీప్ రావళ్ల (87120 18804), వై.శ్రీనివాస్ (87120 18805) లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *