ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు
పటాన్ చెరు:
రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ శాతం పరీక్ష చేయించుకొని టోకెన్ ఇచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి దాన్యం తీసుకొని రావాలని అన్నారు. వర్ష సూచన ఉన్నట్లయితే పంట కోతను తదనుగుణంగా వాయిదా వేయాలి, కోసినట్లయితే పంటను టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలన్నారు. రాబోయే వర్షాకాలంలో దృష్ట్యా రైతులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ బి.జె సురేష్ బాబు, ఎంఏఓ ఉష, ఏఈఓ దేవిసింగ్, కొనుగోలు కేంద్రం ఇంచార్జి రాజు, రైతులు పాల్గొన్నారు.