నరకప్రాయంగా నేషనల్ హైవే 65

politics Telangana

– గడువు దాటినా పూర్తి కాని జాతీయ రహదారి పనులు

– నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

సంగారెడ్డి ఎక్స్‌రోడ్స్ నుంచి మదీనగూడ వరకు ఎన్‌హెచ్‌-65పై చేపట్టిన 6 వరుసల రహదారి విస్తరణ పనులు నిర్ణయించిన గడువు దాటినా పూర్తికాకపోవడంపై నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కిలోమీటర్ 493/000 నుంచి 524/000 వరకు 29.35 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 1,297.75 కోట్ల వ్యయం మంజూరైంది. అసలు పూర్తి గడువు 03-07-2026 కాగా, అనంతరం కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ సమాచారంలో 31-03-2027 గడువు పొడిగించినట్లు తెలిసింది. అదే సమాచారంలో ప్రస్తుత ప్రాజెక్టు పనులు 32 శాతం మాత్రమే పూర్తయినట్లు పేర్కొన్నారు.రూ. 1,297 కోట్లకు పైగా ప్రజాధనంతో చేపట్టిన 29.35 కిలోమీటర్ల పనుల్లో ఇప్పటివరకు 32 శాతం మాత్రమే భౌతిక పురోగతి నమోదవడం, మిగిలిన పనులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమని మెట్టు శ్రీధర్ అన్నారు.

ఎక్కడ చూసినా సగం పనులు చేసి వదిలేయడం, పూర్తి స్థాయిలో రహదారి పనులు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కొద్ది కిలోమీటర్ల ప్రయాణానికే గంటల తరబడి సమయం పడుతోందని, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణంలోనూ నాణ్యతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నిర్మాణ ప్రాంతాల్లో భారీగా దుమ్ము లేవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దుమ్ము నియంత్రణకు క్రమం తప్పకుండా నీటిని చల్లడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, పనుల నాణ్యతను పరిశీలించాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. నాణ్యతా లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో పాటు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.రహదారి, సర్వీస్ రోడ్లు, బాక్స్డ్రైన్, నిర్మాణ సామగ్రి తదితర పనులపై నాణ్యతా పరీక్షలు నిర్వహించి, లోపాలు ఉన్నట్లు తేలితే వాటిని కాంట్రాక్టర్‌తో సరిచేయించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన రహదారిని అందించాలని, ప్రజాధనం భారీగా ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్టులో నాణ్యత, భద్రత, సమయపాలన విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *