పటాన్చెరులో ఘనంగా 3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కాలుష్య రహిత పటాన్చెరునిర్మాణానికి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఆదివారం ఉదయం “3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి 3K రన్ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క ప్రభుత్వానికో, ఒక్క సంస్థకో పరిమితమైన బాధ్యత కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో, పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరులో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ముందుండాలని పిలుపునిచ్చారు.

మన కోసం మాత్రమే కాదు మన తర్వాతి తరాల కోసం కూడా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాలుష్య రహిత పటాన్చెరు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి” అని ఎమ్మెల్యే అన్నారు.3K రన్లో యువత, విద్యార్థులు, ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని “రన్ ఫర్ నేచర్” సందేశాన్ని చాటిచెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు” కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి జైపాల్, గూడెం మధుసూదన్ రెడ్డి, ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్, పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.
