మానవీయ, సాంఘిక శాస్త్రాల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న గీతం

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మానవీయ, సాంఘిక శాస్త్రాలలో యూజీ, పీజీ, పీహెచ్.డీ. కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని ఆ స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ థరు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాతీయ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలలో పొందిన చెల్లుబాటు అయ్యే స్కోర్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, అలాగే గీతం ప్రవేశ పరీక్ష (గాట్-2026) ద్వారా కూడా అర్హత సాధించవచ్చని ఆయన తెలియజేశారు. మూడో దశ ప్రవేశ పరీక్ష ఈనెల 17న జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 14వ తేదీలోగా అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో సమర్పించవచ్చన్నారు.యూజీ స్థాయిలో- సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జర్నలిజం అండ్ మీడియా స్టడీస్, సోషియాలజీ, సినిమాటిక్ ఆర్ట్స్ అండ్ డిజైన్లు ప్రధాన అంశం (మేజర్)గా బీ.ఏ. కోర్సును అందజేస్తున్నామని తెలిపారు.

వీటిలో చేరిన విద్యార్థులకు వారు ఎంచుకున్న విభాగాలలో బలమైన పునాదిని అందించడంతో పాటు, వారి విశ్లేషణాత్మక, సృజనాత్మక, భావ ప్రకటనా నైపుణ్యాలను మెరుగుపరిచేలా ఆయా కోర్సులను రూపొందించామని తెలిపారు. లిబరల్ ఎడ్యుకేషన్ లో భాగంగా, విద్యార్థుల ఆసక్తి, ఆశయాల ఆధారంగా 600కు పైగా సబ్జెక్టుల కలయికలను ఎంచుకోవచ్చన్నారు.పీజీ స్థాయిలో- అప్లైడ్ సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషులలో ఎం.ఏ. కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. ఇవి ఉన్నతమైన సైద్ధాంతిక పరిజ్జానం, పరిశోధనా సామర్థ్యాలు, ఆచరణాత్మక అనువర్తనాలపై దృష్టి పెడతాయన్నారు.ఇక డాక్టోరల్ కోర్సులలో- అప్లైడ్ సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, పొలిటికల్ సైన్స్, సోషియాలజీలలో పీహెచ్.డీ. కోర్సులు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈ రంగాలలో ఉన్నత-నాణ్యత గల పరిశోధన, విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడమే వీటి లక్ష్యమన్నారు.విద్యతో పాటు క్రీడలు, ఇతరత్రా కార్యకలాపాలు, సామాజిక పరస్పర చర్యలతో అనుసంధానించడం ద్వారా సంపూర్ణ విద్యకు జీఎస్ హెచ్ఎస్ ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ శామ్యూల్ వివరించారు.

అత్యాధునిక బోధనా ప్రయోగశాలలు, విస్తృతమైన ఇంటర్నషిప్ అనుభవం, పరిశోధనపై దృష్టి సారించే అధ్యాపక బృందం సమగ్రమైన బోధనను అందించడంలో సహాయపడుతుందని తెలిపారు. విద్యాపరమైన విజయాలకు అతీతంగా విద్యార్థులను తీర్చిదిద్ది, విజ్జానవంతమైన దృక్పథాలు, విమర్శనాత్మక ఆలోచనల ద్వారా సమాజానికి అర్థవంతంగా దోహదపడేలా వారికి సాధికారత కల్పించడానికి గీతం కట్టుబడి ఉందన్నారు.గీతంలోని దాదాపు 33 శాతం మంది విద్యార్థులు ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలు పొందుతున్నారని, వీటిలో బోధనా రుసుము, భోజనం, వసతి ఖర్చులతో సహా పూర్తి మినహాయింపులున్నాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకుని, మే 17న జరిగే ప్రవేశ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఇతరత్రా సమాచారం కోసం www.gitam.edu ను సందర్శించాలని, లేదా 888 4984 000 ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *