అలరించిన సాంకేతిక-సాంస్కతికోత్సవాలు
– విద్యార్థులలో మిన్నంటిన కోలాహలం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వార్షిక సాంకేతిక-సాంస్కృతికోత్సవాలు (ప్రమాణ-2026) శనివారం నిర్వహించిన ఈడీఎం-డీజే నైట్ తో విజయవంతంగా ముగిశాయి. ఈ రెండు రోజుల వేడుకకు విద్యార్థులు, ఇతరుల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. గీతం హైదరాబాదు ప్రాంగణాన్ని సాంకేతిక, సృజనాత్మక, సాంస్కృతిక వ్యక్తీకరణ యొక్క శక్తివంతమైన సంగమంగా మార్చింది.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ప్రమాణ-2026ను లాంఛనంగా ప్రారంభించి, విద్యార్థులను ఉన్నతాశయాల వైపు ప్రేరేపించేలా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ప్రసిద్ధ భారతీయ సినిమా దర్శకుడు, స్ర్కీన్ రైటర్ హరీష్ శంకర్ కూడా విద్యార్థులను తమ కలలను ఆసక్తి, ధైర్యంతో అనుసరించాలని ప్రేరేపిస్తూ ఉత్సాహభరిత, ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.గ్రాండ్ ఆటో ఎక్స్ పోతో ఆరంభమైన ప్రమాణ-2026, విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేలా పలు కార్యక్రమాలకు నెలవుగా మారింది.

సాంస్కృతిక సాయంత్రాలలో ది డెక్కన్ ప్రాజెక్ట్, హెడ్ లైనర్ బ్యాండ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రఖ్యాత నేపథ్య గాయని గీతా మాధుని తన శ్రావ్యమైన గాత్రవిన్యాసంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. తరువాత హై-ఎనర్జీ డీజే యువతతో చిందులేయించింది.ఇక ముగింపు వేడుక మరింత శోభాయమానంగా మారి విద్యార్థుల కేరింతలతో మార్మోగిపోయింది. కాశ్యప్ – ది మ్యూజికల్ సెన్సేషన్, డీజే స్వాట్రెక్స్ ల అద్భుతమైన ప్రదర్శనతో గ్రాండ్ ఫినాలే ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, మరపురాని ఈడీఎం అనుభూతిని అందించింది. నృత్యం, సంగీతం, స్కిట్లు, సాంస్కృతిక యుద్ధాలతో ఉన్నత స్థాయి పోటీలు విద్యార్థులకు వారి ప్రతిభ, సృజనాత్మకతను ప్రదర్శించడానికి అసాధారణమైన వేదికను అందించింది.

హైదరాబాదు చుట్టుపక్కల కళాశాలల నుంచి విద్యార్థులను ప్రమాణ-2026 ఆకర్షించి, వారిలో ఆరోగ్యకరమైన పోటీ, సహకార స్ఫూర్తిని పెంపొందించింది. గీతం హైదరాబాద్ నాయకత్వం ఖచ్చితమైన ప్రణాళిక, తిరుగులేని మద్దతు ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేయడానికి దోహదపడింది.ప్రమాణ-2026తో, గీతం మరోసారి ఆవిష్కరణ, ప్రతిభ, సమగ్రాభివృద్ధిని పెంపొందించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించడమే గాక, సృజనాత్మకత, శ్రేష్ఠతకు కేంద్రంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
