నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

politics Telangana

_ఆర్డీవో కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జీవోలను అమలుపరచండి

_సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శరవేగంగా అభివృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని.. గత ప్రభుత్వ హాయంలో మంజూరైన రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు తగిన సిబ్బందిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించడంతోపాటు చేపట్టబోయే పనుల వివరాలను నివేదిక రూపంలో అందించారు. రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటవుతుండడంతో ఇందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి వస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరారు.నియోజకవర్గానికి మంజూరైన రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యాలయాలకు సంబంధించి స్థలాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్లు, ఆర్డిఓ కార్యాలయం పనుల కోసం నిత్యం పటాన్చెరు ప్రజలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. అతి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *