భగత్ సింగ్ త్యాగ స్పూర్తితో కార్పొరేట్ల,సామ్రాజ్యవాద, మతోన్మాద, ప్రభుత్వ విధానాలపై పోరాడదాం
మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ లౌకిక విధానాన్ని కాపాడుకోవడమే నిజమైన నివాళి
వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం
సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు.
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
భగత్ సింగ్ త్యాగ స్పూర్తితో కార్పొరేట్ల,సామ్రాజ్యవాద, మతోన్మాద, ప్రభుత్వ విధానాలపై పోరాడదామని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ పరిశ్రమలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చుక్క రాములు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటీష్ వారినుండి రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే లక్ష్యం కాకూడదని, భారతదేశంలోని రైతాంగం, శ్రామికులు శ్రమదోపిడీ లేనటువంటి సమాజం కోసం పోరాడాలని దానికి సోషలిజమే పరిష్కారమని భావించి తాను స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ గా మార్చాడన్నారు.
భగత్ సింగ్ జాతీయ ఉద్యమంలో వీరోచిత పాత్ర నిర్వహించినట్లు, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని దేశప్రజల ముందుంచాడని తెలిపారు. శాస్త్రీయ భావజాల వ్యాప్తికి కృషిచేసిన భగత్ సింగ్ మార్కిస్టు అవగాహనతో ఉద్యమాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులో ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు అమరవీరులని అభి వర్ణించారు. నేడు సామ్రాజ్యవాదులు విచ్చలవిడిగా ఇతరదేశాల మీద దాడులు చేసి ఏకపక్ష యుద్దాలకు పాలపడినా, సుంకాలను విధించినా కనీసం అలీనోద్యమ స్పూర్తితో కూడా భారత్ ఖండించలేకపోవడం అత్యంత దారుణమని అన్నారు. భగతసింగ్ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు.

భగతసింగ్ ఆశయాలను అధ్యయనం చేయటంతో పాటు వీలునామా పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని నేటి యువతరానికి ఆయన పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద శక్తులకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ లౌకిక విధానాన్ని కాపాడుకోవడమే భగత్ సింగ్ కు అందించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. అనంతరం భగతసింగ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన “సామ్రాజ్యవాద అమెరికా ఆధిపత్య విధానాలు మన భారతదేశం పై ప్రభావం” అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి.పాండురంగా రెడ్డి, ఎ. వీరారావు, ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.
