పటాన్చెరు
కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదినం సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న 71 మంది కార్మికులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కార్మిక నాయకుడిగా యాజమాన్యాన్ని ఒప్పించి 71 మంది కార్మికులకు ఇళ్లస్థలాలు ఇప్పించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోతలు లేని విద్యుత్ అందించడం మూలంగా మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని అన్నారు. కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో నూతన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కుతో పాటు, శివనగర్ పరిధిలో ఏర్పాటుచేసిన ఎల్ఈడి పార్క్ ద్వారా వేలాది ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతి గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ రాజు, ఆదర్శ్ రెడ్డి, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.