పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 26వేలకు కనీసవేతనం అమలుచెయ్యాలి
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
శాస్త్రీయత లేకుండా ప్రకటించిన కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు 56 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగా రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యత కోసం ఐక్యత-పోరాటం నినాదంతో 1970 మే 30 న సీఐటీయూ ఆవిర్భవించిందని, కార్మికవర్గ హక్కల రక్షణ కొరకు అనేక ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. కనీస వేతనాలు సవరించాలని గత 15 సంవత్సరాలనుండి పోరాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రస్తుతం అమలవుతున్న వేతనాలకంటే తక్కువగా ప్రకటించి తామేదో కార్మికవర్గాన్ని ఉద్ధరించినట్లు ఆర్భాటపు ప్రకటనలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తక్షణమే కానీసవేతనాల జీవో లను సవరించి విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో శాండ్విక్ యూనియన్ నాయకులు ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివ రెడ్డి, ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
