పటాన్చెరు:
ఔషధాలను (మందులు) సూచించిన పద్ధతిలో, అంటే సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవాలని అమెరికాలోని హాటా స్పాట్ థెరప్యూటిక్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు, కంప్యూటేషనల్ సెర్చ్ అధిపతి డాక్టర్ ఆల్డ్రిన్ డెన్నీ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ఆధ్వర్యంలో ‘ఔషధాల ఆవిష్కరణలో సవాళ్ళు అనే అంశంపై గురువారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషదాలను సరిగా వినియోగించకపోతే ఆరోగ్యం మరింత క్షీణించి, ఆస్పత్రిలో కూడా చేరాల్సి రావచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదన్నారు.
దీర్ఘకాలిక పరిస్థితులను నియంత్రించడానికి, తాత్కాలిక పరిస్థితులకు చికిత్స చేయడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఔషధ వినియోగం ఉండాలని ఆయన సూచించారు. సరిగా మందులు మింగితే కొన్నాళ్ళ తరువాత వాటిని తక్కువ మోతాదులోనో, లేదా పూర్తిగా నిలిపివేయడమో జరుగుతుందన్నారు. మందుల వినియోగంపై కొన్ని చిట్కాలను ఆయన వివరిస్తూ, ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవాలని, అందుకు సంబంధించిన సూచనలను ఔషధాలతో పాటు ఉంచుకోవాలని, సరైన మోతాదులోనే వినియోగించాలన్నారు.
అలాగే ఔషధ ఆవిష్కరణలో ఉన్న దశలను కూడా ఆయన విశదీకరించారు. తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు అతిథిని స్వాగతించి సదస్యులకు పరిచయడం చేయడంతో పాటు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజెన్ బయో ఉపాధ్యక్షుడు డాక్టర్ రెజ్ జాన్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు, కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల, డాక్టర్ నరేష్ కుమార్ కటారి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.