మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :
సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని వారాహి కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు (బిఎల్ఎ-2) పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను, ఒకే ఇంట్లో ఉన్న ఓట్లను వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మార్చడం వంటి సాంకేతిక లోపాలను గుర్తించి, వాటిని వెంటనే సరిదిద్దేలా చొరవ చూపాలన్నారు. యువతను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించాలని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డులో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధులు జె. సంగప్ప, రవికుమార్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కోణం విఠల్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు సుభాష్ జాదవ్, మారుతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జహీరాబాద్ లో జరిగిన సమావేశంలోనూ ఆమె పాల్గొని మాట్లాడారు.
