పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నూతన సంవత్సరం సందర్భంగా యువకులు పెడదారి పెట్టకుండా క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.