జూన్ వేతనంతో కలిపి ఇవ్వాలి
అమలు చేయని పరిశ్రమల వద్ద ఆందోళన
సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే అన్ని పరిశ్రమలలో అమలు చేయాలని, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము జూన్ నెల నుంచి అమలు చేయాలని జీవోలో స్పష్టంగా చెప్పిందని, జులైలో ఇచ్చే వేతనంలో కంపల్సరీ అన్ని పరిశ్రమల యజమానులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని పరిశ్రమలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. చాలా రోజుల నుంచి వేతనాలు పెరగలేదని, సిఐటియు అనేక సంవత్సరాల నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు, ఈ వేతనాలను కూడా ఆయా పరిశ్రమలో నిర్దిష్టంగా కేటగిరి వారిగా, వాళ్లకు వర్తించే కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు మిగతా కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు, అమలు చేయని యజమాన్యాల మెడలు వంచుతామన్నారు. గత 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలను పెంచలేదని, పెంచిన తర్వాత కూడా కాలయాపన చేయడం నిర్లక్ష్యం చేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వము స్కిల్, సెమి స్కిల్, ఆన్ సీల్డ్, హై స్కిల్డ్ విభజించిందని, అనేక చోట్ల పరిశ్రమలలో ఆన్ స్కిల్డ్ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఐటీఐ ,డిప్లమాలు , 10 సంవత్సరాల నుంచి పని చేసే వాళ్ళందరూ ఉన్నారని, వీరికి ఆన్ స్కిల్డ్ ఎలా వర్తిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని, అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్ ,మున్సిపాలిటీలు, అర్బన్ అని కేటగిరీలు గా విభజించిందన్నారు. కాబట్టి పరిశ్రమల యజమాన్యాలు వారికి వర్తించే క్యాటగిరిలో ప్రాంతాలవారీగా అమలు చేయాలని ఏమాత్రం కాలసత్వం గాని తేడాగా వచ్చిన కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాలను హెచ్చరించారు.
