మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు 5000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తున్నామని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు.పటాన్చెరు కేంద్రంలో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం మూలంగా అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గం వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణ తరగతులతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడం పట్ల మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు అశోక్, ప్రభాకర్, వెంకటేష్, రాజు, ఇమ్రాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
