ఏఐతో నైపుణ్యాభివృద్ధి, కొత్త అవకాశాలకు బాటలు

politics Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో

సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కృత్రిమ మేధస్సు (ఏఐ) తరచుగా ఉద్యోగాలను పునర్నిర్మించే విఘాతకరమైన శక్తిగా పరిగణిస్తున్నప్పటికీ, ఇది ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలను కూడా తెరుస్తుందని హైదరాబాదులో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ గ్లోబల్ డెలివరీ హెడ్ రాజేంద్ర కుమార్ పాత్రో అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ‘ఏరోస్పేస్ పరిశ్రమ – పురోగతి, ధోరణి, ఉద్భవిస్తున్న అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.తన ప్రసంగంలో, వర్ధమాన ఏరోస్పేస్ ఇంజనీర్లు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ ను స్వీకరించాలని పాత్రో ప్రోత్సహించారు. సరైన సాధనాలు, పరిణతితో కూడిన విద్యార్థులు ఉత్పత్తి రూపకల్పన, ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోలను గణనీయంగా మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగించుకోగలరని చెప్పారు. ఏఐ ప్రాథమికంగా సీఏడీ (CAD) నమూనాల సృష్టిని మార్చగలదా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నాయన్నారు.

వాణిజ్య విమానాల పరిణామం, ప్రస్తుత వాతావరణం, భవిష్యత్తు పోకడలు, కీలక సవాళ్లు వంటి అంశాలపై పాత్రో మాట్లాడుతూ ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమపై లోతైన అవగాహనను కల్పించారు. విమాన ఇంజిన్లు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఇంటీరియర్స్, ఏవియానిక్స్, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ (ఎంఆర్వో) వంటి ప్రధాన రంగాల గురించి ఆయన చర్చించారు. భారతదేశంలో పెరుగుతున్న విమానయాన రంగాన్ని ప్రస్తావిస్తూ, 2030 నాటికి మనదేశంలోని విమానాల సంఖ్య రెట్టింపు కావచ్చని ఆయన జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఎంఆర్వో సామర్థ్యాలకు బలమైన డిమాండ్ ఏర్పడుతుందని పాత్రో అంచనా వేశారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, కోర్ ఇంజనీరింగ్ పరిజ్జానాన్ని ప్రోగ్రామింగ్, ఆటోమేషన్ నైపుణ్యాలు, ఏఐ సాధనాల పరిచయంతో కలపడం యొక్క ప్రాముఖ్యతను సైయంట్ ఉపాధ్యక్షుడు నొక్కి చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించాలని విద్యా సంస్థలకు ఆయన సూచించారు. చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు అర్థవంతమైన పారిశ్రామిక శిక్షణను కూడా పొందాలని ప్రోత్సహించారు.తొలుత, గీతం కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి అతిథిని స్వాగతించి, సత్కరించారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ. అక్తర్ ఖాన్ స్వాగతోపన్యాసం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి కిషోర్ జుజ్జువరపు కార్యక్రమ సమన్వయంతో పాటు వందన సమర్పణ కూడా చేశారు.ఈ ఆతిథ్య ఉపన్యాసం విలువైన పరిశ్రమ అంతర్దృష్టులను అందించడమే గాక, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగంలో ఉద్భవిస్తున్న అవకాశాల కోసం సిద్ధం కావడానికి విద్యార్థులను ప్రేరేపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *