మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అందించి భారతదేశ గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై గర్వపడేలా చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రాన్ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గత నెల 23, 24వ తేదీలలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్ లో భారత దేశం తరపున సంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కు చెందిన 14 మంది క్రీడాకారులు (35 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపు) వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. మొత్తం 52 పతకాలు సాధించగా వీటిలో బంగారు పతకాలు 27, వెండి పతకాలు 11, కంచు పతకాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా తమ క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 80, 90 ఏళ్ల వృద్ధాప్యంలోను అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని పథకాలు సాధించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఫహీం ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఉపాధ్యక్షులు బాలయ్య, నరేందర్ రెడ్డి, భాస్కరరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లోర, సభ్యులు కరుణాకర్ రావు, మల్లయ్య గౌడ్, నిర్మల, అనసూయ, సరోజినీ, తదితరులు పాల్గొన్నారు.
