మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘గాడోలియనం-డోప్ చేయబడిన నికెల్ ఫెర్రైట్ నానోపార్టికల్స్ యొక్క లక్షణాలపై భస్మీకరణ ఉష్ణోగ్రత, కూర్పు యొక్క ప్రభావం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.పూర్ణచంద్రరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ భవానీ అధ్యయనం, సోల్-జెల్ ఆటో-దహన పద్ధతిని ఉపయోగించి జీడీ-డోప్డ్ నికెల్ ఫెర్రైట్ నానోపార్టికల్స్ యొక్క సంశ్లేషణ, లక్షణాలను అన్వేషించినట్టు తెలియజేశారు. వాటి నిర్మాణ, క్రియాత్మక లక్షణాలపై కాల్సినేషన్ ఉష్ణోగ్రత ప్రభావాన్ని పరిశీలించామన్నారు.ఈ పరిశోధన ఫలితాలు అధిక-ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్స్, మాగ్నెటిక్ పరికరాలు, ఈఎంఐ షీల్డింగ్, మైక్రోవేవ్ టెక్నాలజీలలో అనువర్తనాల కోసం ఈ నానోమెటీరియళ్ల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తాయని తెలిపారు.డాక్టర్ భవానీ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
