భద్రతే మొదటి ప్రాధాన్యం
అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు
ప్రతి పనిదినం భద్రతతోనే ప్రారంభమవ్వాలి – అధికారులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నియోజకవర్గం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం పరిశ్రమ ప్రాంతంలోని న్యూలాండ్ లేబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-2లో జాతీయ భద్రతా దినోత్సవం, వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. గౌరీ శంకర్, వై. శ్రీ విద్యా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ ఏడాది భద్రతా వారోత్సవాలను “భద్రతపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం, సాధికారత” అనే అంశంతో నిర్వహించారు. వారంరోజుల పాటు కొనసాగిన కార్యక్రమాలు భద్రతా జెండా ఆవిష్కరణతో ప్రారంభమై, ఉద్యోగుల భద్రతా ప్రతిజ్ఞతో కొనసాగాయి. సంస్థలో భద్రత పట్ల ఉన్న నిబద్ధతను మరింత బలోపేతం చేసే విధంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
మార్చి 1 నుండి 10 వరకు భద్రతకు సంబంధించిన పోటీలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక సంస్థలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి పనిదినం భద్రతా దృక్పథంతో ప్రారంభించాల్సిన అవసరాన్ని, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.న్యూలాండ్ లేబొరేటరీస్లో అమలు చేస్తున్న ఇన్సిడెంట్ కంట్రోల్ విధానాలు, సురక్షిత పనితీరు పద్ధతులను వారు ప్రశంసించారు. భద్రతా వారోత్సవాల నిర్వహణలో యాజమాన్యం, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సహకారం ప్రశంసనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేట్ ఈహెచ్ఎస్ హెడ్ అనీల్ కుమార్, ప్లాంట్ హెడ్ మహేష్ ఆర్ జోషి, కార్పొరేట్ లీగల్ అడ్వైజర్ జి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
