పటాన్చెరు
వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం రూపొందించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు పర్యటిస్తారని, రైతులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.