_వేగంగా అభివృద్ది చెందుతున్న పటాన్ చెరు మీదుగా సంగారెడ్డికి మెట్రో రైలు పొడగించాలి
మనవార్తలు ,పటాన్ చెరు:
హైదరాబాద్ మెట్రోరైలును సంగారెడ్డి వరకు పొడగించాలని మెట్రోరైలు సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ముదిరాజ్ భవన్ లో మెట్రో రైలు సాధన సమితి ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ,కార్మికులు ,కర్షకులు, ఉద్యోగులు, విద్యావేత్తలు ,ప్రొఫెసర్లు ,పారిశ్రామికవేత్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు .మెట్రో రైలును మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో మెట్రోరైల్ , ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు.పటాన్ చెరు ప్రాంతంలో ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో కమ్ ఫ్లై ఓవర్ ను పటాన్ చెరువు వరకు నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ లేఖ రాస్తామని పేర్కొన్నారు.
మెట్రోరైలు సాధన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఈ ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేలా విధి విధానాలు రూపొందించి అతి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు .ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో జనభా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రో రైలు వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి మెట్రో రైలు పొడిగించేంత వరకు తమ పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. చర్చ వేదిక నిర్వహించిన మెట్రో రైలు సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను స్థానికులు ఘనంగా సన్మానించారు .
ఈ చర్చా వేదిక అనంతరం మెట్రోరైలును సంగారెడ్డి వరకు విస్తరించాలని తీర్మాణించారు. ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టు శ్రీధర్, ప్రముఖులు శంకర్ రావు ,పాశమైలారం ఐలా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పారిశ్రామికవేత్త గోకుల్ శ్రీధర్ ,గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ శివ నాగేంద్ర, హన్మంత్ రెడ్డి ,గిరి, ఇక్బాల్, రాజ్ కుమార్ , నరసింహారెడ్డి ,సరస్వతి ,జంగమ్మ నియోజకవర్గ పరిధిలోని వివిధ కంపెనీల కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.