మనవార్తలు ,పటాన్ చెరు:
రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి వినాయకులను పూజించే లా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం లో మట్టి వినాయకుడి ప్రతిమ ను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరికీ అవగాహన కల్పించేలా ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు వివిధ రసాయనాలతో తయారుచేసిన ప్రతిమలను చెరువులు, కుంటల లో నిమజ్జనం చేసిన అనంతరం కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసే వారిని ప్రోత్సహించడం తో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకుడి ప్రతిమలు పూజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, పట్టణ ప్రముఖులు సపాన దేవ్, తులసి దాస్, మాణిక్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.