ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదు..
– వాశిలి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి :
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం పై నిందలు మోపడం మాని, తప్పనిసరిగా ఎవరికివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సామాజిక వేత్త, టీఆరెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి మరణాలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా విధించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తున్నందున ప్రతిఒక్కరూ బాధ్యతతో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. ఇళ్లలోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని, మనమంతా తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.