ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ లో స్మార్ట్ ట్రెండ్స్ (స్మార్ట్ కామ్-2026) పదో అంతర్జాతీయ సమావేశం ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. సమకాలీన పరిశోధన దిశ, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ల డొమైన్ లలో ఇటీవలి సాంకేతిక పురోగతిపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. ఆమె ప్రసంగం సదస్యుల మన్ననలను పొందింది.పూణే (మహారాష్ట్ర)లోని క్రౌన్ ప్లాజా సిటీ సెంటర్ లో హైబ్రిడ్ విధానంలో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశంలో ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రొఫెసర్లు, నిపుణులు పాల్గొంటున్నారు. గ్లోబల్ నాలెడ్జ్ రీసెర్చ్ ఫౌండేషన్ (జీకేఆర్ఎఫ్), జీ.ఆర్. స్కాలస్టిక్ ఎల్ఎల్ పీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ ఛాంబర్ పార్టనర్ గా, స్ర్పింగర్ పబ్లికేషన్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నాయి.అత్యాధునిక పరిశోధన, ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ కమ్యూనికేషన్స్ లో ఉద్భవిస్తున్న ధోరణులపై ఈ సమావేశం దృష్టి సారించింది. పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు తమ జ్జానం, ఆలోచనలను ఒకరితో మరొకరు పంచుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతోంది. దాదాపు 50కి పైగా దేశాల నుంచి 400కి పైగా పరిశోధనా పత్రాలను పరిశోధకులు సమర్పించారు.డాక్టర్ ప్రీతి విశిష్ట విద్యా నైపుణ్యం, పరిశోధన నాయకత్వం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఉన్నత విద్యకు చేసిన గణనీయమైన కృషిని ఈ ప్రాతినిధ్యం ప్రతిబింబిస్తోంది.

