_ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం
_ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం
_ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
మనవార్తలు ,పటాన్చెరు:
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు పట్టణంలోని ముంబాయి జాతీయ దిగ్బంధం చేశారు. ఈ ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం వారికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని బిజెపి నాయకులు సైతం రైతుల పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, గ్రామాల్లోని రైతులు బిజెపి నాయకుల బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తా చాటుతాం అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.