_మహిళలతో జనసంద్రమైన సభ ప్రాంగణం
_తెలంగాణలో విద్యా రంగానికి పెద్దపీట
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ మరవలేనిదని, అలాంటి దీరోదాత్తురాలు చిట్యాల ఐలమ్మను చిట్కుల్ ఐలమ్మగా మార్చిన ఘనత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కు దక్కిందని ఎమ్మెల్సీ బండా ప్రకాష్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అభినందించారు. వీరనారీ చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని సోమవారం ఐలమ్మ కుటుంబ సభ్యులతో ఆవిష్కరింపజేశారు. అంతకుముందు ఇస్నాపూర్ చౌరస్తా నుంచి వందలాది మంది కళాకారులు, గోండు నృత్యాలు, మహిళల బోనాల ఆటపాటలతో వేలాది మంది అన్ని కుల బాంధవులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీని నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్, చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ చిత్ర పటాలతో ఏర్పాటు చేసిన రథం బైక్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిట్కుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఐలమ్మ మునిమనుమరాలు ఆశ్రితతో కలిసి నీలం మధు ముదిరాజ్ ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, ఐలమ్మ వారసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రతీ ఒక్కరూ పునికి పుచ్చుకోవాలని సూచించారు. ఐలమ్మ భారీ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ లో ఏర్పాటు చేసిన నీలం మధు ముదిరాజ్ ను అభినందించారు. ఐలమ్మ జీవిత చరిత్రను, పోరాట విధానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని సభా సాక్షిగా కోరారు.
ఈ సందర్భంగా వచ్చిన వేలాది మంది అభిమానులను ఉద్దేశించి తెరాస రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సేవలను గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆ రోజుల్లో కుల, మత బేదాలు లేకుండా విలువనిచ్చిన వ్యక్తి అంబేడ్కర్ అయితే నైజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత ఐలమ్మ అని కొనియాడారు.అంబేద్కర్ పేరును అసెంబ్లీకి పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క పిలుపునిస్తే వేలాది మంది జనం వచ్చి ఆశీర్వదించిన ప్రజానీకానికి, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెరాస ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని, బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్యాభ్యాసం చేసేలా రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్య పెంచిందని, భవిష్యత్తులో మండలానికి రెండు గురుకుల పాఠశాలలు వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తెలిపారు. అన్ని కులాలు, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, సామాజిక న్యాయం తెరాస వల్లే జరుగుతుందని ప్రజలు గుర్తించారన్నారు. చిట్కుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆమె సేవలు యువతకు స్ఫూర్తినిచ్చే లా కృషి చేసిన నీలం మధు ముదిరాజ్ యువతకు ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు.
సామాజిక ఉద్యమ కారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ లో మొదటి సారిగా చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ చేయటం చిట్కుల్ ఐలమ్మ అనే స్థాయికి తెచ్చిన మధు భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారురజక సంఘం జాతీయ సంఘాల కో ఆర్డినేటర్ మల్లేశ్ కుమార్ సభకు అధ్యక్షత వహించగా మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య, ఐలమ్మ వారసులు చిట్యాల రామచంద్రం, మునిమనువలు సంపత్, శ్వేత, ఆశ్రిత, రజక సంఘాల నాయకులు, ఆయా కుల సంఘాల నాయకులు, అశేషజనవాహిని పాల్గొన్నారు.