అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని, చిట్కుల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ఎదుర్కొని దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబుజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు ఆయన పార్లమెంటు లోపల, బయట నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.దేశం కరువు కాటకాలతో అలమటిస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చూపిన చొరవ అద్వితీయమని మధు ముదిరాజ్ కొనియాడారు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, ఆధునిక సాగు పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని ‘అన్నపూర్ణ’గా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు.

హరిత విప్లవం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన వేసిన పునాదులే నేడు దేశాన్ని ఆహార భద్రతలో అగ్రగామిగా నిలబెట్టాయని స్పష్టం చేశారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం ఇందిరా గాంధీ హయాం నుండి నేటి వరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వెనుక బాబుజీ ఆలోచనా విధానం ఉందని ఆయన గుర్తు చేశారు. కుల మతాలకతీతంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే అసలైన గౌరవమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *