జూన్ 14న శిల్పకళా వేదికలో
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కళా, సాంస్కృతిక రంగాలకు కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన సాంస్కృతిక వేడుకకు సిద్ధమవుతోంది. ప్రముఖ నృత్య కళాకారిణి, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన తన అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నృత్య ప్రదర్శన “భావ్ (BHAV)”ను హైదరాబాద్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో సంగీతం, నృత్యం, థియేటర్ మరియు లైవ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అత్యున్నత కళాత్మక అనుభూతులను అందిస్తూ “ ఆర్ట్ విత్ ఔట్ బౌండరీస్” అనే భావనతో ముందుకు సాగుతున్న వేదం ఆర్ట్ హైదరాబాద్ ప్రేక్షకులకు విశిష్టమైన శాస్త్రీయ నృత్య అనుభూతిని అందించనుంది.ఈ గ్రాండ్ ప్రదర్శన 2026 జూన్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనుంది.
శోభనా స్వయంగా రూపకల్పన చేసి దర్శకత్వం వహించిన ‘భావ్’ (BHAV) భారతీయ సాంప్రదాయ నృత్య సౌందర్యాన్ని ఆధునిక స్టేజ్ ప్రెజెంటేషన్, సంగీతం, కథనం మరియు లయతో సమ్మిళితం చేసిన అద్భుత కళారూపం. భారతీయ సంస్కృతి, దైవభక్తి మరియు భావవ్యక్తీకరణలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఆధ్యాత్మిక మరియు కళాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.భారతదేశంలోని అత్యుత్తమ శాస్త్రీయ నర్తకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శోభనా, “Ensemble” బృందంతో కలిసి తన అద్భుత నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలు, సంగీత సమన్వయం, నృత్య నైపుణ్యం ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సందర్భంగా వేదం ఆర్ట్ ప్రతినిధి నిఖిల్ పొలేపల్లి మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరం ఎప్పుడూ కళా, సంస్కృతిని ఆదరిస్తూ వస్తోంది. అందుకే ‘భావ్’ (BHAV) వంటి అత్యున్నత కళాత్మక ప్రదర్శనకు హైదరాబాద్ సరైన వేదికగా నిలుస్తోంది. ప్రేక్షకులకు ఇది ఒక చిరస్మరణీయ అనుభూతిగా మిగిలిపోతుంది” అని తెలిపారు.టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి.భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ అద్భుత నృత్య ప్రదర్శన ‘భావ్’ (BHAV) ఈ ఏడాది హైదరాబాద్లో జరగనున్న అత్యంత విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.
