– ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో 11 రికార్డులు లక్ష్యంగా శనివారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి అంగామీ పేపర్తో రూపొందించిన 6,500 గబ్బిలాలు, 5,500 కార్లు, 3,200 డెనోసార్లు, 1,800 కుక్కలు, 3,600 కప్పలు, 3,100 నెమళ్లు, 2,800 పెంగ్విన్లు, 3,100 పందులు, 4,100 షర్టులు, 6,000 మాప్లే ఆకులతో పాటు 6,200 నిమ్మతొనలను ఒకేచోట ఉంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు. అంగామీ కాగితంలో రూపొందించిన వాటిని తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు.గీతం గణితశాస్త్ర విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.మల్లిఖార్జునరెడ్డి వాటికి లెక్కించి అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పత్రాలను గిన్నిస్ అధికారులకు పంపి, వారి ఆమోదం తరువాత రికార్డును ఖరారు చేయనున్నారు.శివాలీ ఇప్పటికే 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పిన విషయం విదితమే.తాజాగా లక్ష్యించిన మరో 11 గిన్నిస్ రికార్డులను శివాలీ సాధించాలని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలిఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభిలషించారు.