_కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి..
_ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి హరీష్ రావు
_లాటరీ పద్ధతిలో బ్లాకుల కేటాయింపు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అగ్గిపెట్ట లాంటి అద్దె ఇల్లు చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్న నిరుపేద ప్రజలకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో 50 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి అందజేస్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో తొలి విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులతో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిఎంఆర్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
తొలి విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం లాటరీ పద్ధతిన బ్లాక్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇళ్ల పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కాపోతున్నట్లు పేర్కొన్నారు.పటాన్చెరుకు సంబంధించిన లబ్ధిదారులందరిని పటాన్చెరు మైత్రి మైదానం నుండి బస్సులు ఏర్పాటు చేసి కొల్లూరు కి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. సొంత నిధులతో 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, తహసిల్దార్, భాస్కర్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు