_గ్రామీణ రోడ్లకు మహర్దశ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని..పాటి, ఘనపూర్, కర్ధనూర్, నందిగామ, భానురు, రుద్రారం, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, లక్డరం గ్రామాల పరిధిలో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. ఘనాపూర్ గ్రామం విశాఖ ఇండస్ట్రీస్ వరకు 2 కోట్ల 25 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.