దొంగ ధర్నాలన్నీ కాంట్రాక్టర్ల కోసమే కదా?_బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్  మీ మద్దతు రైతులకా? లేక మీ కాంట్రాక్టర్లకా అంటూ ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ యువరాజు ధర్నాకు పిలుపు ఇవ్వగానే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ సమస్యపైన ధర్నా చేయాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అసలు మీరు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం రైతులకు, రైతు కూలీలకు పంటలు పండించే అవకాశం లేనప్పుడు వారికి వచ్చే నిధులను దారి మళ్లించి.. వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మీరు ధర్నాలు రైతుల కోసం చేస్తున్నారా? కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారా? అని నిలదీశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు కాంట్రాక్టులు పేరుతో.. సీసీ రోడ్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. మీ క్రషర్ల వల్ల నియోజకవర్గంలోని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని.. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ పథకంలో వచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాలుష్యం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల వలన పరిష్కారం కోసం బాధితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, కోర్టు ద్వారా వారికి కొంత నగదును ఇవ్వాలని తీర్పు వచ్చిందన్నారు.

సంవత్సరాలు గడుస్తున్నా వారికి న్యాయం చేయలేని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కూడా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులకు రైతుల పక్షాన ధర్నాలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇంకోసారి ధర్నాలు చేస్తే భారతీయ జనతాపార్టీ తరపున అడ్డుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్‌రాజ్, ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు షకీల్,‌ దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *