పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ముందస్తు ( హోలీ , జాలీ ) క్రిస్మస్ వేడుకలను ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . శివాజీ ఆడిటోరియంలో విద్యార్థులు వరుసగా 12 వ ఏడాది ఏర్పాటు చేసిన జననోత్సవ ప్రత్యేక సభ , క్రిస్మస్ పాటల ప్రతిధ్వనితో మార్మోగింది . అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు , గంటలు , పుష్పగుచ్ఛాలు , బెలూన్లతో ఆడిటోరియం అంతా పండుగ శోభను సంతరించుకుంది . ప్రార్థనా బృందం , సంగీతం , నృత్యాలు , బ్యాండ్ , నాటికల ప్రదర్శన ఆహూతులందరినీ అలరించాయి . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలు ఈ సందర్భంగా వెలికి రావడంతో పాటు ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యచకితులను చేశాయి . శాంతాక్లాజ్ వేషధారి ఆడిటోరియం అంతా కలియ తిరుగుతూ , చాక్లెట్లు , బహుమతులను పంపిణీ చేశాడు .
ఈ వేడుకలలో భాగంగా , ఉత్సాహభరిత , సందర్భోచిత కళలను ప్రదర్శించిన విద్యార్థులందరినీ ముఖ్య అతిథిగా హాజరైనై ముత్తంగి డివెన్డ్ వర్డ్ సెంటర్ ఫాదర్ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు . క్రిస్మస్ అనేది ఒక సమయం లేదా సీజన్ కాదని , మానసిక స్థితి అని ఆయన ఉద్ఘాటించారు . శాంతి , సద్భావనను గౌరవించడం , దయతో ఉండడం క్రిస్మస్ వేడుకల నిజమైన సందేశంగా ఆయన అభివర్ణించారు . తమ స్నేహితులు , అధ్యాపకులతో కలిసి ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంపై పలువురు విద్యార్థులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు . చివరిగా అల్పాహారంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి .