– వర్క్షాప్ వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి ఉద్బోధ
మనవార్తలు ,పటాన్ చెరు:
వంద మాటలను ఒక్క చిత్రం ద్వారా చెప్పొచ్చని , అలానే ఓ ఇంటి ఆకృతిని రంగుల సచిత్రంగా రూపొందిస్తే చాలా సమయం , డబ్బు ఆదా అవుతాయని వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ‘ ఆకృతులను వాటర్ కలర్ ద్వారా ప్రదర్శించడం’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , నిర్మాణ రూపకల్పన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని , ఇది ప్రాజెక్టు నిర్వహణను , స్పష్టమైన రూపాన్ని అందిస్తుందన్నారు . డిజెన్ ప్రక్రియ పునరావృతమవుతుందని , సమస్యను నిర్వచించడం , సమాచారాన్ని సేకరించడం , మేథోమథనం / విశ్లేషించడం , మెరుగుపరచడం , ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం , చివరగా తుది రూపునివ్వడంగా ఆయన వివరించారు .
ముందుగా , చేపట్టదలచిన ప్రాజెక్టును బాగా అధ్యయనం చేయాలని , తరువాత కంప్యూటర్ పరిజ్ఞానంతో దానికి ఓ రూపునివ్వాలని , క్షేత్రస్థాయికి తగ్గట్టుగా ఆ రూపకల్పన జరిగిందా లేదా అనేది పరిశీలించాలని శ్యామ్ చెప్పారు . డిజెనర్ నిరంతరం సమీక్షిస్తూ తన సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తారని , దానిని మరింత మెరుగుపరుస్తారని , అంతిమంగా తుది రూపునిస్తారని చెప్పారు . వర్ధమాన వాస్తుశిల్పులు ముందుగా భావనలను ఏర్పరచుకోవాలని , దానిని అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలన్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీలక్కుమార్ అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి , కార్యశాలను ప్రారంభించారు . అసోసియేట్ ప్రొఫెసర్ శమంత్ కుమార్ వెంకటరత్నం భట్టు దీనిని సమన్వయం చేశారు . బీఆర్క్ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని వాటర్ కలర్ డిజైన్లను నేర్చుకున్నారు .