_చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్పవిషయమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 26 తేదీన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఈ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. భూమి కోసం,భుక్తి కోసం,దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను చాకలి ఐలమ్మ గడగడలాడించిందని గుర్తు చేశారు .
చిట్కుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి రోజున జరిగే కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు చిట్కుల్ వడ్డెర కాలనీ వద్ద మల్లన్న గుడి ఆవరణ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ భూమి పూజ చేసి వేదిక ఏర్పాట్లను ప్రారంభించారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నారు.

కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ లకు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద నుంచి కేటీఆర్, హరీష్ రావు తదితరులకు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీతో వేదిక వద్దకు తీసుకురానున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువజన నాయకులు కేసీఆర్ బహిరంగ సభకు రావడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో మంత్రులతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ రజక సంఘ నాయకులు పాల్గొననున్నారు. కాగా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
