– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా
మనవార్తలు ,పటాన్ చెరు:
స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . రామలక్ష్మితో కలిసి ఆమె హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు . ‘ స్థిరమైన భవిష్యత్తు కోసం లింగ సమానత్వాన్ని పాటించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , లింగ సమానత్వం ఆవశ్యకతను నొక్కిచెప్పారు .
మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలన్నారు . మహిళలను ఎక్కడికంటే అక్కడకు , ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినివ్వకుండా నియంత్రించం సరికాదని , అది స్త్రీ స్వేచ్ఛను హరించడమేనని ఆమె స్పష్టీకరించారు . ప్రజా రవాణాలో మహిళలను తాకడం సరికాదని , అది ఆ మహిళపై జరిగిన వ్యక్తిగత దాడిగానే ఆమె అభివర్ణించారు . ఏ రకమైన దుస్తులు ధరించాలనేది ఆయా మహిళల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని , దానిపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె ఖండించారు .
మహిళల భద్రత కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిన్హా పిలుపునిచ్చారు . నిత్యజీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న వైరుధ్యాలను రామలక్ష్మి ఏకరువు పెట్టారు . మనదేశంలో మహిళా శ్రామిక శక్తి 27 శాతం మాత్రమేనని , అది పురుషులతో సమాన స్థాయికి చేరినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదుగుతామన్నారు . తల్లి పాల ఆవశ్యకతను ఆమె గుర్తుచేస్తూ , కనీసం పది నెలలపాటు తల్లి పాలు ఇవ్వాలని స్పష్టీకరించారు .మహిళలకు పని ప్రదేశాలలో బిడ్డలకు పాలిచ్చే సౌకర్యంతో పాటు వారు ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లు చేయాలని , జననం సమయంలో తండ్రికి కూడా సెలవు మంజూరు చేయాలని ఆమె సూచించారు .
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసే ఆమె పలు అనుభవాలను ఈ సందర్భంగా ఉటంకించారు . మహిళా సాధికారత ఎక్కడ ఉంటుందో , వారి మాటలను ఎక్కడ గౌరవిస్తారో , వారిని ఎక్కడ బాగా చూసుకుంటారో ఆ దేశం పురోగమిస్తుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . ప్రతి ఒక్కరి జీవితంలోని ఐదుగురు మహిళలు- తల్లి , సోదరి , సహచరి , కుమార్తె , గురువుల ప్రాముఖ్యతను గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరిస్తూ , వారిని అందరూ , అన్నివేళలా గౌరవించాలని సూచించారు . గీతం మహిళా సాధికారిత కమిటీ సమన్వయకర్తలు డాక్టర్ ఎన్.ప్రసన్నలక్ష్మి అతిథులను స్వాగతించగా , డాక్టర్ కె.తేజస్విని వందన సమర్పణ చేశారు . కళాకృతి బృందం , ముఖ్యంగా బృంద నాయకురాలు లలిత సింధూరి , జీఎస్చ్ఎస్ అధ్యాపకులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించడమేగాక , అతిథుల ప్రత్యేక ప్రశంసలనందుకున్నాయి .