-మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా సంబరాలు
మనవార్తలు ,పటాన్ చెరు:
మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ 50 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మయి, సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కోర్టు అండ్ మొబైల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సృజన రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయ తదితర రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాకుండా వివక్షతకు తావులేకుండా చైతన్యవంతులై ఉండాలని చెప్పారు. మహిళల విజయానికి సంకేతంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ మహిళలకు అంకితం చేయబడిన రోజు అన్నారు. మహిళలు సమిష్టిగా ఉండి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ బ్రేక్ ది బియాస్ అనే థీమ్ తో ఈ సంవత్సరం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం పురుషులతో పాటు మహిళలు సమానమేనని తెలిపారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. .భవిష్యత్తులో మరిన్ని మైళ్లు రాళ్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళా డాక్టర్లకు అవార్డులను ప్రధానం చేశారు. అనంతరం మహిళా వైద్యులకు శాలువాతో సత్కరించి మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ చందానగర్ సెంటర్ హెడ్ శ్రీకాంత్, డాక్టర్ విశ్వేష్, మహిళా వైద్యులు పాల్గొన్నారు