– జాతీయ గణిత దినోత్సవంలో శ్రీవేదభారతి చీఫ్ డాక్టర్ అవధానులు స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
సున్నా , దశాంశ సంఖ్య , బెనైరీ సంఖ్యలు , ప్రోగ్రెషన్ , ఇన్ఫినిటీ ( అనంతం ) వంటి ఐదు గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులే చేశారని శ్రీవేదభారతి ముఖ్య నిర్వహణాధికారి , నిమ్స్ కంప్యూటర్ విభాగం పూర్వ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ అవధానులు చెప్పారు . గణితశాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతియేటా డిసెంబర్ 22 న నిర్వహించే ‘ జాతీయ గణిత దినోత్సవాన్ని ‘ గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు . స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని గణితశాస్త్ర విభాగం నిర్వహించిన ఈ స్మారక కార్యక్రమంలో డాక్టర్ అవధానులు ప్రాచీన భారతదేశంలోని గణితశాస్త్ర ఆవిష్కరణలపై ప్రసంగించారు .
భారత ఉపఖండంలో గణితానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందని , ప్రాచీన భారతీయ గణిత శాస్త్రాలన్నీ సంస్కృతంలో సూత్రాల విభాగం రూపంలో ఉన్నాయని , వాటిలో నియమాలు లేదా సమస్యలను పేర్కొన్నట్టు ఆయన చెప్పారు . ఆర్యభట , వరాహమిహిర , భాస్కర -1,2 , విష్ణుగుప్త , సిద్దసేన , మణిత , శ్రీజిధ్వజ , కళ్యాణవర్మ , సింహతిలకసూరి , కాలకాచార్య , మహావీరాచార్య , భటోత్పల , దేవస్వామి , సత్యాచార్యా , జీవశర్మ వంటి పండితులు గణితంలో విలువెన రచనలు చేసినట్టు డాక్టర్ అవధానులు వివరించారు . ఈ సందర్భంగా ‘ వేద గణితం – యంత్ర అభ్యాసం ( మెషీన్ లెర్నింగ్ ) ‘ అనే అంశంపై స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ ప్రసంగించారు .
మెషీన్ లెర్నింగ్ ఎక్కువగా గణిత , గణాంక శాస్త్రాలపై ఆధారపడి ఉందన్నారు . గణితశాస్త్రం మన జీవితంలో ఒక భాగమని , ఆలోచనలో తర్కాన్ని ఇస్తుందని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తన స్వాగతోపన్యాసంలో చెప్పారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , ప్రొఫెసర్ బీఎం నాయుడు , డాక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . గోడపత్రికల రూపకల్పన , గణిత ఫజిల్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు . డాక్టర్ కె.కృష్ణ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .