క్రీడలతో మానసిక ఉల్లాసం
మనవార్తలు ,అమీన్పూర్
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ ఫేస్ 2లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో మైత్రి క్రీడా మైదానాన్ని ఆధునిక హంగులతో అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మినీ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు బోయిని బాల్రాజ్, కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
