గ్రామ స్థాయి నుండి విద్యార్థి, యువత విభాగాలను పటిష్టం చేయండి
పటాన్చెరు
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీకి విద్యార్థి, యువత విభాగాలే వెన్నెముక అని, సంస్థాగతంగా రెండు విభాగాలను పటిష్టం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి, యువత విభాగాల ముఖ్య నాయకులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
పార్టీ అధిష్టానం సూచనలకు అనుగుణంగా గ్రామస్థాయి నుండి నియోజక స్థాయి వరకు విద్యార్థి, యువత, సోషల్ మీడియా కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో రెండు విభాగాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ భవిష్యత్తు యువ నాయకులు మీరేనని, కష్ట పడిన వారికి తప్పకుండా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో యువత విభాగం నుండి నామినేటెడ్ స్థాయి పదవి ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు మేరాజ్ ఖాన్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కృష్ణకాంత్, నియోజకవర్గ అధ్యక్షులు చెన్నారెడ్డి, ఆయా మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.