మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ప్రకృతి హితమే పండుగల పరమార్థమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శనివారం పటాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంటుందని అన్నారు. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులను ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు.ప్రతి ఏటా బల్దియా ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 600 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని, వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.
