మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక బోరాన్ ఖాళీల నిర్ధారిత సృష్టి, లక్షణాల నిర్ధారణ ప్రాజెక్టును హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం చేపట్టింది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్టీ) నిధులతో కూడిన ఈ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. అత్యాధునిక నానోఫ్యాబ్రికేషన్ పద్ధతులను ఉపయోగించి షట్కోణ బోరాన్ నైట్రైడ్ (h-BN)లో క్వాంటం లోపాలను సృష్టించడానికి, అధ్యయనం చేయడానికి అధునాతన పద్ధతులను అభివృద్ధి చేయడంపై ఈ ప్రాజెక్టు దృష్టి పెడుతుందని వివరించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీస్ రంగానికి దోహదపడేలా, విస్తృతమైన స్పెక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్ లక్షణీకరణ ద్వారా క్వాంటం ఉద్గార ధర్మాలను అన్వేషించడమే ఈ పరిశోధన లక్ష్యమన్నారు.
ఐఐటీ బొంబాయి, రోమ్ (ఇటలీ)లో ఉన్న సాపియెంజా విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ ప్రాజెక్టును గీతం హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థికి అధ్యాపకులు, పోస్ట్ డాక్టోరల్ పరిశోధకులు, డాక్టోరల్ స్కాలర్లతో కూడిన అంతర్జాతీయ పరిశోధన బృందంతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ లేదా ఎంటెక్ అర్హతలు కలిగి, సెమీకండక్టర్ పరికరాలు, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ లో బలమైన పునాది ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గేట్ అర్హత, మునుపటి ప్రయోగాత్మక పరిశోధన అనుభవం, XRD, SEM, AFM, ఫోటోల్యూమినిసెన్స్ (PL), రామన్ స్పెక్ట్రోస్కోపీ వంటి అధునాతన క్యారెక్టరైజేషన్ టెక్నిక్ లపై పరిచయం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
మూడేళ్ల కాల పరిమితి ఈ జేఆర్ఎఫ్ కు అర్హతను బట్టి ఫెలోషిప్ అందించబడుతుందని, తొలి రెండేళ్లు నెలకు 37 వేల రూపాయలతో పాటు ఇంటి అద్దె, మూడో ఏడాది సీనియర్ రీసెర్చ ఫెలోగా నెలకు 42 వేల రూపాయలు, హెచ్ఆర్ఏ చెల్లిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకుడి (పీఐ)గా డాక్టర్ శాంతను సాహా నాయకత్వం వహిస్తారని, ఈ ప్రాజెక్టు కోసం 45.43 లక్షల రూపాయల గ్రాంటు డీఎస్టీ మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా నేపథ్యం, పరిశోధన అనుభవాన్ని వివరిస్తూ, తాజా బయోడేటాకు ఒక సంక్లిప్త లేఖను జతచేసి ssaha2@gitam.edu కు పంపాలన్నారు. ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని, ఇంటర్వ్యూలు ఈనెల చివరిలో, లేదా జూలై ప్రారంభంలో నిర్వహిస్తామని తెలిపారు. తక్షణమే విధులలో చేరగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.ఎంపికైన అభ్యర్థి పనితీరు, ప్రాజెక్టు అవసరాలు, పరస్పర అంగీకారం ఆధారంగా, ఈ పదవిలో పీహెచ్.డీ. చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
