మొక్కలు నాటిన గీతం ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
దేశవ్యాప్త ‘తల్లి పేరిట ఒక మొక్క’ (ఏక్ పేడ్ మా కే నామ్) చొరవలో భాగంగా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ప్రచారం, పర్యావరణ సుస్థిరత, జీవావరణ స్పృహను ప్రోత్సహిస్తూ, తమ తల్లుల గౌరవార్థం ఒక మొక్కను నాటమని పౌరులను ప్రోత్సహిస్తోంది.విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు- (గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్) వివిధ గీతం స్కూళ్ల అధిపతులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించడం పట్ల గీతం యొక్క నిబద్ధతను ఈ చొరవ పునరుద్ఘాటించింది.వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో, సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించడంలో మొక్కలు నాటడం యొక్క ప్రాముఖ్యతను ఇందులో పాల్గొన్న ఉన్నతాధికారులు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల శ్రద్ధ, పోషణ, బాధ్యత వంటి విలువలను ప్రతిబింబిస్తూ, తల్లులకు ఒక ప్రతీకాత్మక నివాళిగా కూడా నిలిచింది.మొక్కల పెంపకం కార్యక్రమం, సుస్థిరత, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడానికి గీతం హైదరాబాదు చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణ, దేశ నిర్మాణానికి అర్థవంతంగా తోడ్పడేలా గీతం సిబ్బందిని ప్రేరేపిస్తోంది.
