వైభవంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం

politics Telangana

 -ఆధ్యాత్మిక సాగరమైన చిట్కుల్

-లోక కళ్యాణార్థం నీలం కవిత మధు దంపతుల సంకల్పం

-అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా సాగిన వేడుక

-గోవింద నామస్మరణతో మారుమోగిన పరిసరాలు

-భారీగా తరలివచ్చిన భక్తజనం, పాల్గొన్న ప్రముఖులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భక్తుల జయజయధ్వానాల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ లోని ఎన్ ఎం ఆర్ క్యాంపు కార్యాలయం ఒక మినీ తిరుపతిని తలపించింది. శుక్రవారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫసల్వాది జ్యోతిర్వస్తు పీఠం మహేశ్వర సిద్ధాంతి శర్మ, భూపతి స్వామి గార్ల ఆశీస్సులతో సిరిసిల్ల బీటుకూరి నవీన్ ఆచార్య గారి పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ వేడుకకు భక్తజనం పోటెత్తింది.కళ్యాణ మహోత్సవం కోసం చిట్కుల్ లోని ఎన్ ఎం ఆర్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో సర్వాంగ సుందరంగా భారీ వేదికను తీర్చిదిద్దారు. సిరిసిల్ల నుండి విచ్చేసిన పండిత బృందం ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం నుండే మంగళ వాయిద్యాలు, వేద పఠనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీనివాసుడు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టువస్త్రాలు, విశేష ఆభరణాలతో అలంకరించి వేదికపైకి తీసుకురావడంతో భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.నీలం కవిత నీలం మధు దంపతులు సంప్రదాయబద్ధంగా పీఠంపై కూర్చుని కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన ఈ వేడుకలో పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ వంటి ఘట్టాలను అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు కంకణధారణ గావించి, ప్రవరను చదివి వినిపించారు. జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి భక్తుల హర్షధ్వానాల మధ్య ఆధ్యాత్మిక ఉద్వేగం నెలకొంది. లోక రక్షకుడైన శ్రీనివాసుడు అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించిన ఘట్టం భక్తుల కళ్లకు కట్టినట్లుగా సాగింది. నీలం కవిత మధు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ “శ్రీవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఈ కళ్యాణాన్ని నిర్వహించామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మాకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంతో మానసిక తృప్తిని ఇచ్చిందని వివరించారు. ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల చెంత ఉండి సేవలందిస్తామని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ఈ వేడుకను వీక్షించేందుకు చిట్కుల్‌తో పాటు పటాన్‌చెరు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ముత్తంగి తో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తజనానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి, స్వామివారి లడ్డుప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, పటాన్చెరు ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మహిళా కమిషన్ మెంబెర్ శశికళ యాదవ రెడ్డి, సిద్దిపేట ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పటాన్‌చెరుఏఎంసీ చైర్మన్ శివానందం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ కమీషనర్, కౌన్సిలర్లు, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్ రెడ్డి, ఐన్ టి యూ సి జిల్లా ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, గార్లు విచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *