విద్యా పరిశోధనను విపులీకరించిన సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భారత విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సాన్నిహిత్యం: అంతర్-ఆసియాలో యువతులు అనే శీర్షిక శుక్రవారం ప్రత్యేక ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని గీతంలోని సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన అందించారు.ఆసియా నగరాలైన హాంగ్ కాంగ్, సింగపూర్, గ్వాంగ్ జౌ, బెంగళూరులలో ఆమె ఇటీవల జరిపిన బహుళ-ప్రాంతీయ పరిశోధన ఆధారంగా, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల సంస్కృతులచే రూపుదిద్దుకున్న డిజిటల్ మాధ్యమం, యువతులు తమ గుర్తింపు, సంబంధాలు, ఆత్మీయతను నిర్వహించుకునే విధానాలను ఎలా మారుస్తుందో ప్రొఫెసర్ నిరంజన అన్వేషించారు. ప్రజా, వ్యక్తిగత జీవితాల మధ్య సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ మాధ్యమాల ద్వారా సామాజికత ఆవిర్భావం, రోజువారీ అనుభవంలో స్మార్ట్ ఫోన్ల పాత్ర కీలకంగా మారడం వంటి అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ ఉపన్యాసం భాషా పద్ధతులు, ఆన్ లైన్-ఆఫ్ లైన్ సంబంధాలు, డిజిటల్ సన్నిహిత ప్రవర్తన యొక్క కొత్త రూపాలను కూడా పరిశీలించింది. సమకాలీన సందర్భాలలో భావప్రసార సరళి, ఫ్లాట్ ఫారమ్ వినియోగం, ఎంపిక చేసుకున్న భాషా వాడకం అనేవి భావోద్వేగ వ్యక్తీకరణను, సామాజిక సంబంధాలను ఎలా పునర్నిర్మిస్తాయో వివరించారు.ఈ కార్యక్రమంలో జీఎస్ హెచ్ఎస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ థరు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంగ్లం, ఇతర భారత విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మోండల్ వందన సమర్పణతో ముగిసింది.
వక్త గురించి:
ప్రొఫెసర్ తేజస్విని నిరంజన గీతంలో డైరెక్టర్ గానే కాక, హాంకాంగ్ లోని లింగ్నాన్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్. విశిష్ట పండితురాలైన ఆమె సంస్కృతి, సంగీతం, వలసానంతర అధ్యయనాలపై అనేక ప్రభావవంతమైన రచనలను చేయడమే గాక, సంపాదకత్వం వహించారు. ఆమె అమెరికన్ లిటరరీ ట్రాన్స్ లేటర్స్ అసోసియేషన్ వారిచే ఫిక్షన్ విభాగంలో జాతీయ అనువాద పురస్కారం పొందిన అవార్డు గ్రహీత, అనువాదకురాలు.
