అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకుంటున్న నేటితరం మహిళలు
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలుస్తున్న చేనేత రంగం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పటాన్ చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గీత వెంకట్ అధ్యక్షతన. జరిగిన సమావేశంలో లావణ్య మధునాల మాట్లాడుతు. చేనేత రంగంలో చేనేత మహిళల కృషి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. నేటికీ దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలు నూలు వడకడం,బట్టలు నేయడం వంటి పనుల్లో నిమగ్నమై తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నారన్నారు.చేనేత మహిళలు తమ నైపుణ్యం, శ్రమతో అందమైన వస్త్రాలను తయారు చేస్తూ సంప్రదాయ కళను నిలబెడుతున్నారని, వారి కృషి వల్ల చేతితో నేసిన వస్త్రాలకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగాను మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేనేత మహిళలకు అవసరమైన మద్దతు, శిక్షణ మరియు మార్కెట్ అవకాశాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతారని, శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని,కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు మహిళలు తమ ప్రతిభ, కృషి, సహనంతో గొప్ప విజయాలను సాధిస్తున్నారని అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదని, ప్రతి మహిళకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యతగా గుర్తుతెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షురాలు సంగీత, జి.చంద్రకళ, కె.చంద్రకళ, నర్సమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు.
