ప్రభుత్వ పాఠశాలల్లో స్టేషనరీ కిట్ల పంపిణీ

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

తన నిరంతర దాతృత్వ కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి నిబద్ధతలో భాగంగా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల రుద్రారంలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత స్టేషనరీ కిట్లను పంపిణీ చేసింది.గీతం విద్యార్థులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల అభ్యాసకుల విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం, విద్యపై వారి ఆసక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యార్థులు వారికి అవసరమైన స్టేషనరీ సెట్లతో పాటు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ మార్గదర్శనం, పర్యవేక్షణలో 2013 నుంచి సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత స్టేషనరీ కిట్లు, ఇతరత్రా విద్యా సహాయం చేస్తున్నారు.ఈ కిట్లను అందుకున్న పాఠశాల బాలలు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ, ఫోటోలకు పోజులిచ్చారు. గీతం, అందులోని విద్యార్థులు ప్రదర్శించిన దాతృత్వం, సామాజిక బాధ్యతను ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు.వీడీసీ కోచ్ పార్థసారథి, ఇతర విద్యార్థి వాలంటీర్లతో కలిసి ఈ పంపిణీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, తన చుట్టుపక్కల సమాజాలలో విద్యను పెంపొందించడానికి, బాలల మనస్సులను శక్తివంతం చేయడానికి గీతం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *