పటాన్చెరులో ఘనంగా ముగిసిన 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్
విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
బాల్యం నుండే క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవడం మూలంగా మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం లభిస్తుందని, నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులగా నిర్వహిస్తున్న 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర గలిగిన మైత్రి క్రీడా మైదానం రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా నిలిచిందని తెలిపారు. ఎంతో మంది క్రీడాకారులు ఇదే మైదానంలో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పటాన్చెరులో క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. క్రీడలపై ఆసక్తి ప్రతిభ కలిగిన పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించడంతోపాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా మైత్రి స్టేడియం వేదికగా రాష్ట్ర జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. అతి త్వరలో జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలు సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.అనంతరం విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూప్, రన్నర్ గా నిలిచిన వన్ ఛాంపియన్ జట్లకు లక్ష రూపాయల నగదు బహుమతుల తో పాటు ట్రోఫీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి, సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, పృథ్వి రాజ్, రాజన్ సింగ్, అశోక్, మల్లేష్ యాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
