భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే
పటాన్చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు అంశాలలో విద్యుత్ వాహనాలు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నాయని భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదేనని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎంఆర్ థండర్ ఈవి చార్జింగ్ స్టేషన్ ను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఇటీవల విద్యుత్ వాహనాల వినియోగం పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనదారుల సౌకర్యార్థం చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాల కొనుగోలులో విద్యుత్ వాహనాలకే వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విద్యుత్ వాహనాల కొనుగోలు అంశంలో పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి కోసం నేటి తరం యువత చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విషయంలో ఆసక్తి కనబరచాలని విజ్ఞప్తి చేశారు. ఈవీల వినియోగం వలన పర్యావరణంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో థండర్ ప్లస్ సంస్థ సీఈఓ రాజు, జనరల్ మేనేజర్ సతీష్, రాకేష్, భద్రాల భాస్కర్ రెడ్డి, శ్రీనాథ్, కౌశిక్, శ్రేయ, తదితరులు పాల్గొన్నారు.
