ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ముత్తంగి డివిజన్ పాటి గ్రామ పరిధిలో గల హనుమాన్ దేవాలయానికి సంబంధించిన దేవుడి మాన్యం భూమి కబ్జాకు గురవుతుందని.. కబ్జాకోరుల నుండి భూమిని కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 197 లో ఒక ఎకరా 33 గుంటలు హనుమాన్ దేవాలయం పేరుపై ఉందని ఇటీవల కొందరు వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వా రికార్డులోనూ హనుమాన్ దేవాలయం పేరుపై ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి భూమి రక్షణకు పాటుపడాలని వారు విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వ, దేవాదాయ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.. అతి త్వరలో పూర్తి సర్వే నిర్వహించి.. భూమి రక్షణకు సొంత నిధులతో ఫెన్సింగ్ సైతం వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.
